నవదిశ, తెలంగాణ బ్యూరో :
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ విధుల నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన 150 మంది గ్రేహౌండ్స్ పోలీసు సిబ్బందితో మంగళవారం సైబరాబాద్ సీపీ కార్యాలయం ఆడిటోరియంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ సమావేశమయ్యారు. వారం రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందితో సీపీ మాట్లాడారు. ట్రాఫిక్ విధులను సమర్థవంతంగా నిర్వహించడం, ప్రజలతో మర్యాదగా వ్యవహరించడం, ట్రాఫిక్ నియంత్రణలో పాటించాల్సిన విధానాలపై సూచనలు తెలియచేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శిక్షణలో ట్రాఫిక్ నిర్వహణ, ట్రాఫిక్ ఇంజనీరింగ్, చట్టపరమైన అంశాలు వంటి విషయాలపై ఇండోర్, అవుట్డోర్ తరగతుల ద్వారా అవగాహన కల్పించినట్లు తెలిపారు. అలాగే హెల్మెట్ వినియోగం, లేన్ క్రమశిక్షణ, రాంగ్సైడ్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ట్రాఫిక్ విధులకు ఆటంకం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించిన సీపీ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచాలని చెప్పారు. ప్రతి పోలీసు సిబ్బంది ప్రజల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్పై చైతన్యం కల్పించాలని సూచించారు. ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, అక్కడ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తెలిపారు.
ఈ వర్షాకాలంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సేవాభావంతో, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజలకు తక్షణ సహాయం అందించాలని, తద్వారా పోలీసు శాఖపై ప్రజల విశ్వాసం మరింత పెరిగేలా కృషి చేయాలని పేర్కొన్నారు. తమ ప్రవర్తన, పనితీరుతో పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ టి. అన్నపూర్ణ, ఎస్బీ డీసీపీ సుధీంద్ర, ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిని రెడ్డి, సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్, సీఏఆర్, హెడ్క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, శేరిలింగంపల్లి ట్రాఫిక్ ఏడీసీపీ హనుమంతరావు, ట్రాఫిక్ అడ్మిన్ ఏడీసీపీ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

