నవదిశ, రంగారెడ్డి బ్యూరో: రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. రికవరీ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ ఖాసిం ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.
సమాచారం ప్రకారం, డాక్టర్ ఖాసిం పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆస్పత్రి యాజమాన్యం వేధింపుల కారణంగానే డాక్టర్ ఖాసిం ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు సమాచారం. ఘటన అనంతరం ఆస్పత్రి యాజమాన్యం మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా పోస్టుమార్టం కోసం తరలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల అసలు కారణాలు, ఆరోపణలపై పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

