నవదిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడు రూ.1.20 కోట్ల జీవిత బీమా రక్షణ కల్పించే ఎంప్లాయీస్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ను ప్రవేశపెడుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
రేపే ప్రారంభం..! ఎంప్లాయీస్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్లో ఉద్యోగులు, పెన్షనర్లు ఎలాంటి ప్రీమియం, చందా, ఇతర చెల్లింపులేవీ కట్టాల్సిన అవసరం లేదు. ఈ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఈనెల 25న రవీంద్రభారతిలో మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ బీమా పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వివిధ బ్యాంకులతో అవగాహన(ఎంఓయూ) కుదుర్చుకోనుంది. రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు చెబుతున్నారు.

